త్వరలో తెలంగాణపై ప్రకటన


కేంద్ర హోం శాఖ మంత్రి షిండే
న్యూఢిల్లీ, జూలై 18 (జనంసాక్షి) :
తెలంగాణపై త్వరలోనే ప్రకటన చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే పేర్కొన్నారు. అయితే అది పార్లమెంట్‌ సమావేశాలకు ముందా వెనకా అన్నది ఇప్పట్నుంచే చెప్పలేకున్నా తెలంగాణపై తేల్చేస్తామని షిండే స్పష్టంచేశారు. తెలంగాణపై అటా ఇటా అన్నది తేలుస్తామని అన్నారు. ప్రత్యేక తెలంగాణపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని గురువారం పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. నెల రోజుల్లో తెలంగాణపై పూర్తి స్థాయిలో పరిష్కారం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికే దీనిపై చర్చించారని అన్నారు. ఇక కాంగ్రెస్‌ వర్‌ఇంగ్‌ కమిటీలో చర్చించి ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే కమిటీ సమావేశం ఎప్పుడు జరిగేది, అది కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయమా, యూపీఏ నిర్ణయమా, ప్రభుత్వ నిర్ణయమా అన్న విషయాన్ని  సుశీల్‌ కుమార్‌ షిండే చెప్పలేదు. కాగా ఆగస్టు 5నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ లోపలే తెలంగాణపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.