లండన్‌లో తెలంగాణ బోనాలు

లండన్‌, (జనంసాక్షి) : ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌లో తెలంగాణ బోనాలు సందడి చేశాయి. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో పలువురు తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన వి. ప్రకాశ్‌, బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ఎన్‌. రామ్‌చందర్‌రావు, ప్రముఖ కళాకారుడు రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. స్వపరిపాలనలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. ఆచార జయశంకర్‌ స్ఫూర్తిగా ప్రత్యేక రాష్ట్రం స్ఫూర్తిగా తెలంగాణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ మోసం చేసిందని, ఎన్‌డీఏ అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తుందని రామ్‌చందర్‌రావు అన్నారు. భవిష్యత్‌ తరాల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గంప వేణుగోపాల్‌, అనిల్‌ కూర్మాచలం, పవిత్రరెడ్డి, నాగరాజు, అశోక్‌ పెద్దిరాజు, శశిధర్‌, రోహిత్‌రావు, సంతోష్‌, ప్రసాద్‌, శివాజీ, సునీల్‌, చిత్తరంజన్‌, చందు, మల్లారెడ్డి, తిరుపతి, నగేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.