సై సైరా రాజనర్సింహ


అభినందించిన తెలంగాణ ఉద్యోగులు
హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) :
తెలంగాణ సాధన కోసం అధిష్టానంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను తెలంగాణ ఉద్యోగులు అభినందించారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్లిన ఉద్యోగులు తెలంగాణ ఏర్పాటుపై రాజనర్సింహ రోడ్‌మ్యాప్‌ రూపొందించి అధిష్టానాన్ని ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. తెలంగాణ బిడ్డగా రాజనర్సింహా సీమాంధ్ర పెత్తందారులకు దీటుగా తెలంగాణ గళం వినిపిస్తున్నారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ సాధించే వరకూ ఉద్యమించాలని కోరారు. సీమాంధ్ర పెత్తందారులు తెలంగాణ ఏర్పడకుండా సర్వశక్తులు ఒడ్డుతున్నారని, తమ ఆర్థిక బలంతో వివిధ రాష్ట్రాల్లోని ప్రత్యేక ఉద్యమాలను ప్రోత్సహించడం ద్వారా తెలంగాణు అడ్డుకోజూస్తున్నారని ఆరోపించారు. వారి ప్రయత్నాలకు గండి కొట్టాలని కోరారు. కాంగ్రెస్‌ అధిష్టానానికి సరైన నివేదికలు ఇచ్చి ప్రజలు ఆకాంక్షను వ్యక్త పరచాలని కోరారు. ఇదే తరహాలో ప్రజల ఆకాంక్ష నెరవేరే వరకూ పట్టుసడలకుండా ప్రయత్నించాలని కోరారు. ఆయనను కలిసిన వారిలో విట్టల్‌ తదితరులు ఉన్నారు.