తెలంగాణ వచ్చే వరకూ అప్రమత్తంగానే ఉందాం


టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
హైదరాబాద్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకూ అప్రమత్తంగా ఉందామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. శనివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో ఆయనను తెలంగాణ ఉద్యోగులు కలిసి అభినందించారు. నాలుగు దశాబ్దాల పోరాటం ఫలితం వచ్చే దశలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సీమాంధ్ర ప్రాంత నాయకులు, పెత్తందారులు ఈ దశలో కూడా తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని ఇప్పుడే సంబరాలు జరుపుకోవద్దని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఆమోదం పొందిన తర్వాతే సంబరాలు జరుపుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు.