దాడులకు గురవుతున్న తెలంగాణ ఉద్యోగులను రప్పించండి
ఆంధ్ర ఉద్యోగులను పంపించండి : దేవీప్రసాద్
రాష్ట్ర వ్యాప్తంగా శాంతి ర్యాలీలు
హైదరాబాద్, ఆగస్టు 17 (జనంసాక్షి) :
సీమాంధ్ర ప్రాంతంలో దాడులకు గురవుతున్న తెలంగాణ ఉద్యోగులను ఇక్కడికి రప్పించాలని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ కోరారు. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన శాంతి ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఇక్కడ అక్రమంగా ఉద్యోగాలు పొందిన ఆంధ్ర వారిని వారి ప్రాంతం పంపించి అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను హైదరాబాద్తో పాటు జిల్లాలకు రప్పించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు, కృత్రిమ ఉద్యమకారులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. అక్కడ ఉన్న కొద్దిపాటి మంది ఉద్యోగులపై దాడులకు తెగపడటం సరికాదని అన్నారు. వారెవరూ అక్రమంగా అక్కడ ఉద్యోగాలు పొందలేదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతీయులు రాజ్యాంగబద్ధంగానే సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. కానీ హైదరాబాద్ సహా తెలంగాణలోని పదిజిల్లాల్లో ఆంధ్రోళ్లు ఏ పద్ధతుల్లో ఉద్యోగాలు సంపాదించింది అందరికీ తెలుసన్నారు. ఉద్యోగులపై దాడులకు పాల్పడుతూ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టవద్దని హితవు చెప్పారు. తెలంగాణ ప్రజలు రెచ్చిపోతే ఇక్కడి ఆంధ్రోళ్ల పరిస్థితి ఏమిటో గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు.