సీమాంధ్రకు పోవడానికి వీసా కావాలా? ఎంపీ వి.హనుమంతరావు

హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) :
సీమాంధ్రకు పోవడానికి వీసా కావాలా అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు ప్రశ్నించారు. తిరుమలకొండపై తాను రెచ్చగొట్టి వ్యాఖ్యాలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌కు రావాలంటే వీసా కావాలంటూ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అన్నారని, ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రజలు వెళ్లాలంటే వీసా అవసరమా అని ప్రశ్నించారు. ఉద్రిక్త వాతావరణంలో ఎందుకొచ్చారంటూ అలిపిరి వద్ద ఆందోళనకారులు తనను ప్రశ్నించారని, మరి తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో సీమాంధ్ర నాయకులను తెలంగాణ ప్రాంతానికి ఎందుకొచ్చారని తాము నిలదీశామా అని విహెచ్‌ అన్నారు. సీమాంధ్రులు కావాలంటే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి హైదరాబాద్‌లో వుండవచ్చని ఆయన తెలిపారు. సీమాంధ్రుల పట్ల తనకు గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు.