యూటీ వద్దు సోనియాను కలిసిన అసదుద్దీన్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడానికి తాము అంగీకరించమని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. మళ్లీ దేశ రాజధానిలో రాయల తెలంగాణ అంశాన్ని అసదుద్దీన్‌ తెరమీదకు తీసుకువచ్చారు. దాంతో ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొద్ది రోజులుగా రాయల తెలంగాణను వ్యతిరేకిస్తున్న అసదుద్దీన్‌ సోనియా గాంధీతో జరిగిన భేటిలో ఓకే చెప్పినట్టు తెలిసింది. హైదరాబాద్‌ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఒప్పుకోమని అసదుద్దీన్‌ తెలిపినట్టు సమాచారం. అయితే తెలంగాణ ప్రాంతంలో పది జిల్లాలతో కూడిన రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తున్న చేపథ్యంలో రాయల తెలంగాణ అంశం మళ్లీ కొత్త వివాదానికి తెర లేపే అవకాశం కనిపిస్తోంది. అసదుద్దీన్‌ రాయల తెలంగాణ ప్రతిపాదన తెలంగాణలో కూడా చిచ్చు రేపే సూచనలు స్పష్టంగా ఉన్నాయి.