కిరణ్ కుర్చీ దిగి మాట్లాడు

అధిష్టానాన్ని ధిక్కరించడంపై కాంగ్రెస్ వర్గాల ఫైర్
60 ఏళ్ల ఆకాంక్షపై ఏమంటవ్ : జానా
నచ్చకపోతే నెహ్రూ విడిపోమన్నడు : డీకే అరుణ
నీవు సీల్డ్ కవర్ సీఎం : దామోదర
రాష్టాన్ని విభజిస్తే సమస్యలొస్తాయని అంటు న్నావ్, మరి 60 ఏళ్ల ఆకాంక్షపై ఏం మాట్లాడతావని మంత్రి జానారెడ్డి సీఎం కిరణ్కుమార్రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం హఠాత్తుగా నిర్ణయం తీసుకోలేదని వివరించారు. కాంగ్రెస్పార్టీలోకి ఎందరో నేతలు వచ్చారు, వెళ్లారని తెలిపారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎం ప్రకటించాలని లేదంటే తాము ఆయనను సీఎంగా భావించమని వివరించారు. తెలంగాణపై హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన సీఎం కిరణ్ ఇపుడు తెలంగాణను వ్యతిరేకిస్తూ మాట్లాడటం తగదని ఎంపి సురేష్ షెట్కార్ అన్నారు. అలాంటప్పుడు అదే విషయాన్ని అధిష్టానానికి నేరుగా ఎందుకు చెప్డం లేదన్నారు. అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ నోట్ రాబోతోందని ఎంపీ తెలిపారు. విభజనపై కేబినెట్ నోట్ రాబోతోందనే సమాచారం ఉందని ఆయన అన్నారు. పచ్చి సీమాంధ్ర వాదిగా ఉంటూ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న సీఎం కిరణ్కుమార్రెడ్డి వెంటనే తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మాజీమంత్రి రెడ్యా నాయక్ అన్నారు. శనివారం వరంగల్ జిల్లా కురవి మండల కేంద్రంలో జరిగిన సాధువుల సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్టాక్రి ముఖ్యమంత్రిగా ఉండి సీమాంధ్రకు వత్తాసు పలకడం సరికాదన్నారు. దోచుకుని.. దాచుకుంటున్న సీమాంధ్రలు ఇప్పటివరకు కోట్లు దండుకున్నారన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు అనేక విధాలుగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలతో పదవిలో ఉండి అధిష్టానాన్నిధిక్కరించడం దారుణమని విహెచ్ అన్నారు. ఆయనకు ఇష్టం లేకపోతే పదవి నుంచి దిగిపోయ మాట్లాడాలన్నారు. సిఎం వ్యాఖ్యలపై కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆయనను సిఎం గుర్తించాల్సిన అవసరం లేదన్నారు.



