గర్భవతి అయిన భార్యను హత్యచేసి తగలబెట్టిన భర్త

కొందుర్గు, మహబూబ్‌నగర్‌ : అదనపు కట్నం తేవాలంటూ గర్భవతి అయిన భార్యను చిత్రహింసలకు గురి చేసి కిరాతకంగా చంపి ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. కొందుర్గు ఏఎస్‌ఐ కృష్ణయ్య కథనం మేరకు కేశంపేట మండల పరిధిలోని కొత్తపేటకు చెందిన ఉమాదేవి(22) కొందుర్గు మండల కేంద్రానికి చెందిన సర్వని శ్రీనివాస్‌తో 2012 డిసెంబర్‌ 7న వివాహమైంది. పెళ్లి సమయంలో కట్న కానుకల కింద ఆరు తులాల బంగారం, ఒక ద్విచక్రవాహనం, లక్ష రూపాయల నగదు ఇచ్చారు. జల్సాలకు అలవాటుపడిన శ్రీనివాస్‌ అదనపు కట్నం కోసం ఉమాదేవిని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇదే క్రమంలో గత నెలలో ఒకసారి గొడవపడగా ఉమాదేవి తల్లిదండ్రులు సర్దిచెప్పారు. మంగళవారం రాత్రి ఇంటికొచ్చిన శ్రీనివాస్‌ భార్యతో గొడవపడి రాయితో మోది హత్య చేశాడు. అనంతరం బుధవారం ఉదయం ఇంటి ఆవరణలో కిరోసిన్‌ పోసి తగలపెట్టాడు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు శ్రీనివాస్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.