విశాఖ సాగర తీరంలో అపూర్వ ఘట్టం.. ‘యోగాంధ్ర’ గిన్నిస్ రికార్డు కైవసం

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ‌నివారం విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఈ బృహత్ యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ అపూర్వ కార్యక్రమంలో మూడు లక్షలకు పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.విశాఖ నగరంలోని సుందరమైన రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు విస్తరించిన సుదీర్ఘ మార్గంలో లక్షలాది మంది ప్రజలు ఏకకాలంలో వివిధ యోగాసనాలు వేశారు. క్రమశిక్షణతో, సమన్వయంతో సాగిన ఈ యోగా ప్రదర్శన చూపరులను అబ్బురపరిచింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట, ఒకే సమయంలో యోగా చేయడం ద్వారా గతంలో గుజరాత్‌లోని సూరత్‌లో నమోదైన రికార్డును ‘యోగాంధ్ర-2025’ అధిగమించడం విశేషం. ఈ భారీ జనసమీకరణతో గతంలో సూరత్‌లో 1,47,952 మందితో నెలకొల్పిన యోగా రికార్డును విశాఖ అధిగమించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ గిన్నిస్ రికార్డు సాధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్ఠలు అంతర్జాతీయ వేదికపై మరోసారి ఇనుమడించాయి. విశాఖ సాగర తీరం ఈ చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది.

తాజావార్తలు