జడ్చర్ల, మే 16 (జనంసాక్షి): వేసవి కాలంలో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు తీవ్ర ఎండల వల్ల ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా ఎయిర్ కూలర్లను సమకూర్చినట్లు విర్కో కంపెనీ ప్రతినిధి జే.వి ప్రతాప్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వీర్కో ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విర్కో ప్రతినిధి జే.వి ప్రతాప్ రెడ్డి ఆసుపత్రి వర్గాలకు 18 ఎయిర్ కూలర్లను అందజేసి మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఆసుపత్రికి వచ్చే రోగులకు, వారి తోడుగా ఉండే సహాయకులకు కొంతైనా ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో విర్కో ఫౌండేషన్ తరఫున ఈ చిన్న ప్రయత్నం చేశామని, సమాజం పట్ల బాధ్యతతో సంస్థ ఎల్లప్పుడూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని అన్నారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అర్షదుల్లా మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో విర్కో ఫౌండేషన్ వారు స్పందించి కూలర్లను విరాళంగా ఇవ్వడం అభినందనీయ మన్నారు. ఈ విరాళం వల్ల వార్డుల్లోని రోగులకు ఎంతో ఉపశమనం లభిస్తుందని పేర్కొంటూ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విర్కో సిబ్బంది సాయి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.