మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి

పర్వతగిరి, జూలై 04 (జనం సాక్షి) స్వాతంత్య్ర సంగ్రామ విప్లవ జ్యోతి, మన్యం వీరుడు, సాయుధ పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పర్వతగిరి మండల కేంద్రంలో అల్లూరి యూత్ అధ్యక్షుడు నాగుల రాజు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. స్థానిక సర్పంచ్ చీదురు శంకర్, మాడుగుల రాజు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకుల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు భారత జాతికి స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమర చరిత్రలో ఆయన చూపిన ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగనిరతి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. న్యాయం కోసం పోరాడే సంకల్పం, దేశం పట్ల అంకితభావం ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు ఆశయాలను కొనసాగిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తుంగ రాజు, అల్లూరి యూత్ ఉపాధ్యక్షులు మాడుగుల అఖిల్, చీదురు తిరుపతి, గోనె వెంకన్న, ఎడెల్లి ప్రదీప్, చెనమాల నరసయ్య, బోనగిరి దుర్గేష్, పటేల్ శ్రీకాంత్, విష్ణు, రాజు, సాయి, రమేష్, చంద్రయ్య, ప్రశాంత్, యువకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.



