మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల ఉలిక్కిపడింది. నాడు విప్లవ బీజాలు నాటిన వెలిశాల నేడు శోకసంద్రంలో మునిగింది. పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా, తాడిత, పీడిత, బలహీన వర్గాల కోసం పోరుబాట ఎంచుకున్న ఆ గ్రామ ముద్దుబిడ్డ, అజ్ఞాత వైపు అడుగులు వేసి ఏనాడు వెనుదిరిగి చూడలేదు. పోరుబాటలోనే అంచెలంచెలుగా ఎదిగి, చివరికి అల్లూరి సీతారామరాజు జిల్లా మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నేలకొరిగాడు. మావోయిస్టు అగ్ర నేత గాజర్ల రవి అలియాస్ గణేశ్.. గాజర్ల రవి మృతి చెందాడన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగారు..’ఆపరేషన్ కగార్’ మావోయిస్టులకు శాపంలా మారింది. వరుస ఎన్కౌంటర్లతో అరణ్య రోదనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లాలో భీకర ఎన్కౌంటర్ జరిగింది. మారెడుమిల్లి అటవీ ప్రాంతంలోని కొయ్యలగూడెం సమీపంలో మావోయిస్టు అగ్ర నేతలు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అల్లూరి జిల్లా పోలీసులు, గ్రేహౌండ్స్ సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి నుంచి కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరువర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెలిశాల కు చెందిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ తో పాటు మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలు, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ అరుణ తీవ్రమైన బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా మరో దళ సభ్యుడు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే, ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో మూడు AK-47 రైఫిళ్లతో పాటు భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
– ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో శాంతి చర్చలకు..
గాజర్ల రవి అలియాస్ గణేశ్ స్వస్థలం భూపాలపల్లి జిల్లా వెలిశాల. ఆయన సోదరులు ఆజాద్, అశోక్ (ఐతు) కూడా మావోయిస్టు పార్టీలో పని చేశారు. సోదరుడు ఆజాద్ గతంలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతి చెందగా.. మరో సోదరుడు అశోక్ కొన్నాళ్ల క్రితం పోలీసుల ఎదుట సరెండర్ అయ్యాడు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004, అక్టోబర్లో జరిపిన శాంతి చర్చల్లో మావోయిస్టు పార్టీ తరపున ప్రతినిధిగా ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ పాల్గొన్నారు. ఆ శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో కామ్రేడ్ గాజర్ల రవి కీలక పాత్ర పోషించారు.