మహబూబ్‌నగర్‌ జైలు నుంచి రైతులు విడుదల

మహబూబ్‌నగర్‌ (జనంసాక్షి) : రాజోలి మండలం ధన్వాడలో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేసి జైలుకెళ్లిన రైతులు బుధవారం రాత్రి మహబూబ్‌ నగర్‌ జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారు. దీంతో ఒక్కసారిగా జైలు వద్ద భావోద్వేగాలు కనిపించాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సైతం వారి రాకకోసం ఉత్కంఠ ఎదురుచూస్తున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ జైలు వద్ద వారిని కలిసి మాట్లాడారు. ‘తుమ్మిళ్ల ప్రాజెక్ట్‌ ద్వారా వేలాది ఎకరాలకు నీరు అందించాం. వేరే ప్రాంతం వాళ్ళు అలంపూర్‌, గద్వాల్‌ కి వలస వచ్చే విధంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో చేసాము. ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న పొలాల్లో పరిశ్రమ సరికాదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పచ్చబడిన పొలాల్లో మళ్ళీ పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేయడం సరి కాదు. రైతులకు బేడీలు వేసి తీసుకుపోవడం సరికాదు. దొంగల లెక్కన రైతులను చూడటం బాధాకరం. అణచివేతలను ఎదిరించే స్వభావం తెలంగాణ ప్రజల రక్తంలో ఉంది.. కేసు ల పేరుతో అరాచకం చేస్తే సరి కాదు.. ప్రభుత్వం.. అధికారుల తీరు ఇదే విధంగా ఉంటే 12 గ్రామాలకు 1200 గ్రామాలు అండగా వచ్చి పోరాటం చేస్తారు. డ్యూటీలో ఉన్న జైలర్‌ని కూడా కేసు లో పెట్టారు. పొలాల వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులను పట్టుకొచ్చి కేసులు పెట్టారు. తప్పుడు కేసులను నమోదు చేసారు. పంటలు పండిరచే చోట పరిశ్రమ వద్దు.. వెంటనే రద్దు చేయాలి.. రైతులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలి. మేము అధికారంలో ఉన్నప్పడు ప్రజా వ్యతిరేకంగా పోలేదు.. ప్రజలు వ్యతిరేకిస్తే సమీక్షించి వాళ్ళ డిమాండ్‌కు అనుగుణంగా నిర్ణయాలు మార్పు చేసాము’ అని అన్నారు. మాజీ మంత్రి వెంట మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నర్సింహలు, పట్టణ అధ్యక్షులు శివరాజ్‌, నాయకులు నవకాంత్‌, పాల సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.