విద్యుత్ షాక్ తో మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ.11వేల ఆర్థిక సహాయం

 

 

 

చెన్నారావుపేట, జనవరి 2 (జనం సాక్షి):

దాతలుగా ముందుకు వచ్చిన లింగాపురం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు

విద్యుత్ షాక్ తో మృతి చెందిన లింగాపురం గ్రామానికి చెందిన పల్లాటి సబిత కుటుంబానికి లింగాపురం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు రూ.11 వేల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం అందించారు. విద్యుత్ షాక్ తో సబిత గత కొద్ది రోజుల క్రితం మృతి చెందడంతో ఆమె ఇద్దరు కుమార్తెలు దేవిక, సహస్రలు పెద్ద దిక్కును కోల్పోయారు. గ్రామ మాజీ సర్పంచ్ తప్పెట రమేష్ “జనం సాక్షి” దిన పత్రికలో డిసెంబర్ 27వ తేదీన విద్యుత్ ఘాతంతో తల్లి మృతి.. పెద్ద దిక్కును కోల్పోయిన చిన్నారులు…అని వచ్చిన కథనాన్ని వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో తల్లిని కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని పోస్టులు పెట్టి వేడుకున్నారు. అంతేకాక జనం సాక్షిలో వచ్చిన కథనం పలువురి దాతలను కదిలించింది. ఆమె కుటుంబానికి గ్రామస్తులు, దయార్ధ హృదయులు, దాతలు ఆర్థిక సహాయం చేయడానికి ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. కొందరు ఫోన్ పే, గూగుల్ పే 9000593955, 9959348888 నెంబర్లకు తమకు తోచినంత ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. అదేవిధంగా గ్రామంలోని జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరుపేద కుటుంబానికి రూ.11 వేల ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా ముందుకు వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సలీం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్, ఉపాధ్యాయులు ఇంద్ర కరుణాకర్ రెడ్డి, కిషన్, రఘునయ్య, జయంతి, పద్మ, గంగాధర్, దసృ, శ్రీహరి, కల్పన, సిబ్బంది రచన, రమేష్, లింగన్న, తదితరులు పాల్గొన్నారు.