జీ7 వేదికగా ఏఐ డీప్‌ఫేక్‌లపై ప్రధాని మోదీ ఆందోళన

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానం వల్ల తలెత్తుతున్న సవాళ్లు, ముఖ్యంగా డీప్‌ఫేక్‌ల వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కెనడాలోని ఆల్‌బెర్టాలో జరుగుతున్న జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఏఐ ద్వారా రూపొందించే కంటెంట్‌కు తప్పనిసరిగా వాటర్‌మార్కింగ్ ఉండాలని లేదా అది ఏఐ సృష్టించినదనే స్పష్టమైన ప్రకటన ఉండాలని అభిప్రాయపడ్డారు.సమాజంపై ఏఐ చూపిస్తున్న ప్రభావం గురించి ప్రస్తావిస్తూ, ఈ సాంకేతికతకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా సమగ్రమైన పాలనా వ్యవస్థ అవసరమని ప్రధాని మోదీ సూచించారు. ప్రస్తుత యుగం ఏఐదే అయినప్పటికీ, సాంకేతికతతో కూడిన వ్యవస్థలను సురక్షితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన నొక్కిచెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు ప్రయోజనం చేకూర్చినప్పుడే దానికి నిజమైన విలువ ఉంటుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏ దేశాన్ని కూడా వెనుకబడనివ్వకూడదని ఆయన అన్నారు. భారత్‌ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామ్యబద్ధం చేసిందని, తద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా సామాన్య ప్రజలను కూడా శక్తివంతం చేసిందని ఆయన వివరించారు. ఈ సంద‌ర్భంగా సమగ్రమైన, సామర్థ్యవంతమైన, బాధ్యతాయుతమైన ఏఐ వ్యవస్థ ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.