గొర్రెల స్కామ్‌లో ఏసీబీ దూకుడు

` కస్టడీలోకి మాజీ ఎండి, తలసాని ఓఎస్డీలు
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో గొర్రెల స్కామ్‌ దర్యాప్తులో ఏసీబీ అధికారులుదూకుడు పెంచారు. నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం మాజీ పశు సంవర్ధక శాఖ ఎండీ రాంచందర్‌ నాయక్‌, తలసాని ఓఎస్డీ కళ్యాణ్‌ లను కస్టడీకి తీసుకున్నారు. కాగా జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న పశు సంవర్ధక శాఖ మాజీ ఎండీ రామ్‌ చందర్‌ నాయక్‌.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాజీ ఓఎస్డీ కళ్యాణ్‌ కుమార్‌లను మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది.దీంతో ఏసీబీ అధికారులు సోమవారం నుంచి మూడు రోజుల పాటు రామ్‌ చందర్‌ నాయక్‌, కళ్యాణ్‌లను కస్టడీ విచారణ చేయనున్నారు. గొర్రెల స్కామ్‌లో ఇప్పటికే 10 మందిని నిందితులుగా గుర్తించి పలువురిని అరెస్ట్‌ చేశారు. గొర్రెల స్కామ్‌లో మొదట రూ. 2.10 కోట్లు దారి మళ్ళినట్టు గుర్తించారు. పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్‌ రామ్‌ చందర్‌ నాయక్‌ , ఓఎస్డీ కళ్యాణ్‌ అరెస్ట్‌తో రూ.700 కోట్ల స్కామ్‌ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది. కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్‌ మోహినూద్దిన్‌ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.