మానసిక ప్రశాంతతకు యోగా కీలకం: నారా బ్రాహ్మణి
విశాఖపట్నం (జనంసాక్షి): యోగా ప్రాముఖ్యతను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లి, దానికి విస్తృత ప్రచారం కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో ‘యోగాంధ్ర’ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ యోగా విశిష్టతను వివరించారు. మానసిక ప్రశాంతతను పొందడానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ నిరంతర కృషితోనే యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, అనేక దేశాల ప్రజలు దీనిని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుంటున్నారని బ్రాహ్మణి ప్రశంసించారు. కాగా, విశాఖ సాగర తీరంలో జరిగిన ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.