దుమ్మురేపుతున్న తుఫాన్‌

యూపిలో 19మంది మృతి
పలుచోట్ల మృత్యువాత పడ్డ పశువులు
తక్షణ చర్యలకు సిఎం యోగి ఆదేశాలు
లక్నో,జూన్‌7(జ‌నంసాక్షి): ఉత్తరాది రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో దుమ్ము తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను దాటికి ఇప్పటికే 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 48 మంది గాయపడ్డారు. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. గోడలు కూలిపోయి అనేక మంది చనిపోయినట్లు యూపీ రిలీఫ్‌ కమిషనర్‌ తెలిపారు.
అత్యధికంగా మెయిన్‌పురిలో ఆరుగురు, ఇతాలో ముగ్గురు, కస్‌గంజ్‌లో ముగ్గురు, మోరదాబాద్‌, బదౌన్‌, పిలిభిత్‌, మధుర, కన్నౌజ్‌, సాంభల్‌, ఘజియాబాద్‌లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క మెయిన్‌పురిలోనే 41 మంది గాయపడ్డారు. తుపాను కారణంగా ఎనిమిది పశువులు కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు. తాజా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. తుపాను బాధితులకు సాయం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సహాయకచర్యలను పర్యవేక్షించాలంటూ సంబంధింత మంత్రులకు సూచించారు.