అక్టోబర్ 30న ‘ఛలో రాజ్భవన్’
హైదరాబాద్: తెలంగాణ విద్యార్ధి జేఏసీ తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. అక్టోబర్ 30 ‘ఛలో రాజ్భవన్ ‘ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలంగాణ విద్యార్థి జేఏసీ తెలిపింది. సెప్టెంబర్ 30న నిర్వహించబోయే ‘ తెలంగాణ మార్చ్’కు సంపూర్ణ మద్దతునిస్తున్నట్టు విద్యార్ధి జేఏసీ ప్రకటించింది. అక్టోబర్ 1న హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రభుత్వం నిర్వహించబోయే ‘అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు’ను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. రేపు తెలంగాణ విద్యార్థి జాగో పేరుతో ర్యాలీలు చేపడుతామని విద్యార్ధి జేఏసీ పేర్కొంది. సెప్టెంబర్ 15న గన్పార్క్ అమరవీరుల స్థూపం వరకు విద్యార్థుల కవాతు ఉంటుందని చెప్పింది. ఈ నెల 17న విద్యార్ధి ఆత్మగౌరవ జెండాల ఎగురవేత, వినాయక చవితి రోజున గణేష్ మండపాల వద్ద జెండాల ఆవిష్కరణ కార్యక్రమంల ఉంటుందని తెలిపింది. అక్టోబర్ 24 సత్యాగ్రహ దీక్షలు, 26న బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. వచ్చే నెల 28న తెలంగాణ ద్రోహుల దిష్టిబొమ్మలను నిమజ్జనం చేస్తామని పేర్కొంది.



