అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలపై అవగాహన కల్పించండి

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ, మలేరియా వ్యాధుల నివారణకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. వర్షాకాలం ముగిసే వరకూ వైద్య, ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఇవాళ అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా మలేరియా అధికారులు మున్సిపల్‌ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని వాడడం, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిల్వ నీరు తొలగింపు తదితర ఆంశాలపై రానున్న 15రోజుల్లో విస్త్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని ఆసుపత్రుల ద్వారా వినియోగిస్తున్న మందులు, ఓఆర్‌ఎస్‌ పాకెట్ల కాలపరిమితి తేదీలను ప్రధానంగా పరిశీలించాలని సూచించారు.