ఆర్టీఓ ఘేరావ్‌

ఆర్టీఓ ఘేరావ్‌

బోయినిపల్లి, జూన్‌ 5 : మిడ్‌మానేరులో ముంపుకు గురిఅవుతున్న బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలోని హైస్కూల్లో మంగళవారం ఆర్డీఓ సునంద గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని 43 మంది వితంతువులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ నివేదికలు చదివి వినిపించి అర్హులైన వారిని ఈ నివేదికలో పొందుపరిచామని ఆమె తెలిపారు. 2003వరకూ గ్రామంలో ఉన్నవారికే ప్యాకేజీ వర్తిస్తుందని, ఎక్కడో ఉంటూ ఇదే గ్రామానికి చెందిన వారమని, మాకు కూడా పరిహారం అందించాలని గొడవకు దిగారు. ఆర్డీఓ అనంతరం అక్కడి నుంచి వెళుతుండగా నిర్వాసితులు ఆమెను అడ్డగించి స్కూల్‌ గేటును మూసివేశారు. కాగా ఆమె మాట్లాడుతూ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ నియమాల ప్రకారం అందరికీ న్యాయం జరిగేలా  నివేదికలు తయారు చేశామని ఆమె పేర్కొన్నారు. నిర్వాసితులు వినకపోవడంతో అక్కడ అర్ధగంటపాటు రసాభాసగా మారింది. వెంటనే విషయం తెలుసుకున్న వేములవాడ టౌన్‌ సీఐ.ఉపేందర్‌ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ దూలం మధు, వీఆర్‌ఓ. గోరేమియా, పద్మయ్య, నిర్వాసితులు పాల్గొన్నారు.