ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీబీఐ పిటిషన్‌

హైదరాబాద్‌,జూలై 5 (జనంసాక్షి): కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ సిబిఐ గురువారంనాడు సిటి సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గతంలోనే ఆస్తుల అటాచ్‌మెంట్‌కు పిటిషన్‌ దాఖలు చేసినా దానిలో తప్పులు ఉన్నాయంటూ కోర్టు నిరాకరించడంతో నేడు సవరించిన పిటిషన్‌ను సిబిఐ దాఖలు చేసింది. జగతి పబ్లికేషన్స్‌, జనని ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్‌కు సంబంధించిన ఆస్తులను ఎటాచ్‌ చేయాలంటూ కోరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి ఈ సంస్థలకు చెందిన ఆస్తుల వివరాలను సేకరించి సిబిఐ తన పిటిషన్‌లో పొందుపరిచి కోర్టుకు సమర్పించింది. జగన్‌ ఆస్తులతో పాటు ఎమ్మార్‌ అవకతవకల కేసులో కోనేరు రాజేంద్రప్రసాద్‌, సునీల్‌రెడ్డిల ఆస్తులను కూడా ఎటాచ్‌మెంట్‌ చేసేందుకు అనుమతి కోరుతూ సిబిఐ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. వీరిరువురికి సంబంధించి 50 ఆస్తులను సిబిఐ గుర్తించింది. కోనేరు ప్రసాద్‌కు సంబంధించి విశాఖపట్నం, భీమిలి, భోగాపురం, సబ్బవరం, విజయనగరం తదితర ప్రాంతాలలో ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. ప్రసాద్‌ కుటుంబ సభ్యులైన విమల, మధు, ప్రశాంత్‌, ప్రదీప్‌, కృష్ణతేజల ఆస్తులను కూడా ఈ పరిధిలోకి తేవాలని కోరింది. అలాగే సునిల్‌రెడ్డికి సంబంధించి మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, కడప జిల్లాల్లో ఆస్తులు ఉన్నట్లు సిబిఐ గుర్తించింది. సునిల్‌రెడ్డి కుటుంబసభ్యులు సింగిరెడ్డి, సత్యవతి, వసంతలక్ష్మి, సుజాత, సుధాకర్‌ల ఆస్తులను కూడా అటాచ్‌మెంట్‌ పరిధిలోకి తేవాలని సిబిఐ కోర్టును కోరింది.