ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలి-మంత్రి హరీశ్రావు
హైదరాబాద్(జనం సాక్షి): తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. జోరు వానలతో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో.. కృష్టా, గోదావరి నదుల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది.ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టు అధికారులు, ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. వాట్సాప్ ద్వారా క్షేత్రస్థాయి ఇంజినీర్లకు సూచనలు, సలహాలిస్తూ ప్రాజెక్టుల పనులు, ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతున్న నీటిపై అధికారుల నుంచి సమాచారం సేకరించి విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. గేట్లు ఎత్తితే వరద నీరు కిందికి ఒకేసారి ప్రవహించే ప్రమాదముండగా, దిగువ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరిస్తున్నారు.



