ఏజెన్సీ అభ్యర్థులకు ప్రమోషన్లు కల్పించడం హర్షనీయం

నర్సంపేట, జూన్‌ 18(జనంసాక్షి) : గిరిజన విద్యార్థుల బాగోగులను దృష్టిలో పెట్టుకొని 17 మంది గిరిజన ఏజెన్సీ అభ్యర్థులకు ఆశ్రమ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా నియమించడం హర్షనీయమని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు బొట్ల పవన్‌, నెల్లుట్ల సుమన్‌, బొట్ల నరేష్‌, రాజేందర్‌, జంపయ్యలు అన్నారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన ఐక్య విద్యార్థి సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ కమీషినర్‌, ఐటిడిఏ పివో, డిడిలు గిరిజన విద్యార్థుల విద్యాభివృద్దిని దృష్టిలో పెట్టుకొని 17 మంది ఏజెన్సీ అభ్యర్థులు, 10 మంది నాన్‌ ఏజెన్సీ అభ్యర్థులను ఆశ్రమ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా నియమించడం జరిగిందన్నారు. గూడూరులో అవగాహన లేని కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు అసత్య ఆరోపణలు చేయడం దారుణమన్నారు. గూడూరు బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న వ్యక్తిపై అనుచిత వాఖ్యలు చేయడం తగదన్నారు. విద్యారంగంపై ఎంత మాత్రం అవగాహన లేకుండా ఐటిడిఏ అధికారుల నిర్ణయాన్ని తప్పుబట్టడం సరైందికాదన్నారు. ఒక్క గూడూరు ఆశ్రమ పాఠశాలలో మహిళా హెచ్‌ఎంను నియమించాలని కొన్ని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేయడం అర్థరహితమైందన్నారు. ఇప్పటికైనా గిరిజన విద్యార్థుల అభివృద్దికోసం పనిచేస్తున్న ఐటిడిఏ అధికారులపై ఆరోపణలు చేయడాన్ని ఐక్య విద్యార్థి సంఘాలు ఖండిస్తున్నాయని వారు స్పష్టం చేశారు. ఈసమావేశంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఐలయ్య, వెంకటేష్‌, హరీష్‌, సుధాకర్‌, మేఘం తదితరులు పాల్గొన్నారు.