ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ

జమ్మూకశ్మీర్‌ ఉగ్రవాదంపై పోరులో దేశ ఐక్యతే కీలకమని మోదీ ఉద్ఘాటన జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ అమానవీయ చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు, దీని వెనుకున్న కుట్రదారులకు అత్యంత కఠినమైన శిక్ష తప్పదని ఆయన గట్టిగా హెచ్చరించారు. బాధితుల కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని భరోసా ఇచ్చారు. ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 121వ ఎపిసోడ్‌లో జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడినీ కలచివేసిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. “ఈరోజు మీతో నా మనసులోని మాట పంచుకుంటున్న వేళ, నా హృదయం తీవ్ర వేదనతో నిండి ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్ని గాయపరిచింది. బాధితుల కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడూ తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తున్నాడు. ఉగ్రవాద దాడి చిత్రాలను చూసిన తర్వాత ప్రతి భారతీయుడు ఆగ్రహంతో రగిలిపోతున్నాడని తాను అర్థం చేసుకోగలనని ప్రధాని అన్నారు. “ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి నిరాశకు, పిరికితనానికి పహల్గామ్ దాడి అద్దం పడుతోంది” అని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొంటున్న తరుణంలో, పాఠశాలలు, కళాశాలలు తిరిగి కళకళలాడుతున్న వేళ, అభివృద్ధి పనులు ఊపందుకున్న సమయంలో, ప్రజాస్వామ్యం బలపడుతున్నప్పుడు, పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నప్పుడు, యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నప్పుడు.. దేశ శత్రువులకు, జమ్మూకశ్మీర్ శత్రువులకు ఇదంతా నచ్చలేదని ప్రధాని విమర్శించారు. “కశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఉగ్రవాదులు, వారి యజమానులు ఇంత పెద్ద కుట్ర పన్నారు” అని మోదీ ఆరోపించారు.

తాజావార్తలు