కేజ్రివాల్‌కు నా మద్దతు ఉండదు అన్నా సంచలన ప్రకటన

న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 19(జనంసాక్షి):
అవినీతి వ్యతిరేక ఉద్యమంపై భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించేందుకు ప్రముఖ సంఘ సేవా కార్యకర్త అన్నా హజరే బుధవారం పలువురు కార్యకర్తల ను నిపుణులు కలుసుకున్నారు. ఈ సమావేశంలో మాజీ అన్నా బృందం సభ్యులు అరవింద్‌ కేజ్రీవాల్‌, కిరణ్‌ బేడీ, ప్రశాంత్‌ భూషణ్‌, మనీష్‌ సిపోదియా, కమార్‌ విశ్వాస్‌ కూడా పాల్గొన్నారు. రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుపై బృంద సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాగా రాజకీయ పార్టీ ఏర్పా టుకు అన్నా కూడా సుముఖంగా లేరు. కేజ్రీవాల్‌ అభ్యర్థులకు తన మద్దతును ఆశించరాదని అన్నా స్పష్టం చేశారు. పార్టీ కావాలంటే పెట్టుకో గానీ, తన మద్దతును మాత్రం అడగవద్దని తెలిపారు. ఆ పార్టీలో వేయి మంది అభ్యర్థులు ఉంటే అందరికీ తాను మద్దతు ఇవ్వలేనన్నారు. కాగా కొత్త పార్టీకి అనూహ్య స్పందన వస్తోందని కేజ్రీవాల్‌ చెప్పుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వే ఫలితాలు కూడా అదే వెల్లడిస్తున్నాయని అంటున్నారు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని అన్నా స్పష్టం చేశారు.