నేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తాం

సిరిసిల్ల, జూలై 23 (జనంసాక్షి) : సిరిసిల్లలోని నేత కార్మికులను ఆదుకునేందుకు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే కార్మికుల కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెడతారని వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. సోమవారం సిరిసిల్లలో చేనేత దీక్ష కార్యక్రమాన్ని ఆమె చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో 75 రూపాయలున్న పింఛన్‌ వైఎస్‌ అధికారంలోకి వచ్చాక 2 వందల రూపాయలకు పెంచా రన్నారు. నేత కార్మిక కుటుం బాలకు ఆసరాగా 35 కిలోల బియ్యాన్ని ప్రతి కుటుంబానికి అందించారన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలం దించేందుకు ఆరోగ్యశ్రీని ప్రవే శపెట్టారన్నారు. విద్యార్థుల కోసం ఫీజు ఇంబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలుచేశామన్నా రు. వైఎస్‌ చనిపోయాక ఆయ న సంక్షేమ పథకాలన్నింటినీ ప్రభుత్వం తూట్లు పొడించిం దని విమర్శించారు. గాంధీజీ స్ఫూర్తితో వైఎస్‌ఆర్‌ ఖాదీ వస్త్రాలను ధరించడమే గాకుండా ప్రభుత్వోద్యోగులను కూడా వారానికి ఒక్క రోజు తప్పకుండా ఖాదీ బట్టలను ధరించాలని సూచించారు. చేనేతకు వన్నె తెచ్చిన ఘనత స్వర్గీయ వైఎస్‌ఆర్‌ దేనని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ హయాంలో చేనేత రుణమాఫీ కోసం బడ్జెట్‌లో 312 కోట్లు కేటాయించగా ప్రస్తుత ప్రభుత్వం వాటిని కుదించివేసిందని అన్నారు. చేనేత కార్మికుల సమస్యలపై పోరాటం చేసేందుకు తమ పార్టీ ముందు వరసలో ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణాలోని సాగునీటి, తాగునీటి కోసం వైఎస్‌ జగన్‌ కృషి చేస్తారన్నారు. మిడ్‌ మానేరు నిర్వాసితులకు ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం అందించలేదని విమర్శించారు. సమస్యలకు పరిష్కారం కావాలంటే మళ్లీ వైఎస్‌ స్వర్ణయుగం రావాలని అది జగన్‌బాబుకే సాధ్యమని పేర్కొన్నారు. ఈ దీక్షలో వైఎస్‌ఆర్‌ పార్టీ నాయకులు పుట్ట మధు, కొండా సురేఖ, ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌, కె.కె. మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.