పోలవరం టెండర్ల గడువు జూలై 5కు వాయిదా

హైదరాబాద్‌ : పోలవరం టెండర్ల గడువు జూలై  ఐదుకు వాయిదా పడింది. తాజాగా ప్రభుత్వం ఈ టెండర్లను ఈ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా ఆహ్వానించింది. 4,717 కోట్ల రూపాయలను ఈ పనులకోసం అంచనా వేశారు. స్పిల్‌వే, రాక్‌ఫిల్‌ డ్యాం, పిల్లర్‌ హౌస్‌, 800 మెగావాట్ల విద్యుత్తు కేంద్రం ఫౌండేషన్‌ పనుల కోసం ఈ టెండర్లను పిలిచారు. గతంలో టెండర్‌ నిబంధనకు ప్రస్తుతం నిబంధనకు రెండు  మార్పులు ప్రధానంగా చేశారు. టెండరు వేసినవారు అనుభవం గణించేందుకు ఈ తరహా పనులు ప్రైవేటుగా చేసినా వాటిని పరిగణనలోకి తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. మరొకటి ప్రాజెక్టు మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటును ప్రభుత్వం  అవసరం మేరకు చేస్తుందని, ఇది ఐచ్ఛికమైన అంశంగా చేర్చారు. జూన్‌ 15 టెండరు దాఖలుచేసేందుకు చివరి తేదీగా తొలుత నిర్ణయించారు.పలువురు కాంట్రాక్టర్ల నుంచి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని  తేదీని జూలై 5కి వాయిదా వేసినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.అదే రోజు టెండర్లు తెరుస్తారు. టెక్నికల్‌ బిడ్‌ను ఆ రోజు,పది రోజుల తర్వాత ప్రైస్‌ బిడ్‌ను తెరుస్తామని  ప్రకటించారు. గతంలో పోలవరం టెండర్లపై దుమారం చెలరేగడంతో వాటిని రద్దు చేసిన విషయం విదితమే.