ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ నేతల బస్సుయాత్ర

హైదరాబాద్‌: అసెంబ్లీ నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌ వరకు టీఆర్‌ఎస్‌ నాయకులు చేపట్టిన బస్సుయాత్ర ప్రారంభమైంది. సడక్‌ బంద్‌ విజయవంతం చేయడానికి ప్రజలను చైతన్య పరిచేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు ఈ బస్సుయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేపటి లోగా ఉద్యమకారులపై బైండోవర్‌ కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు విమర్శించారు. దీనికి నిరసన తెలుపుతున్నామని, నిర్భందాలతో ఉద్యమాన్ని అపలేరన్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సడక్‌బంద్‌ను తెలంగాణ ప్రజలు విజయవంతం చేస్తారని తెలిపారు.