రేపు హైదరాబాద్‌ రానున్న జైట్లీ

హైదరాబాద్‌: సింబయోసిస్‌ ఇంటర్నేషనల్‌ విశ్వవిద్యాలయం(ఎస్‌ఐయూ) హైదరాబాద్‌ క్యాంపస్‌ను ప్రారంభించడానికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆదివారం ఇక్కడకు రానున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మామిడిపల్లి వద్ద ఏర్పాటు చేసిన క్యాంపస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.టి. రామారావు కూడా పాల్గొననున్నారు. దాదాపు 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న క్యాంపస్‌లో విద్యార్థుల తరగతి గదులు, వసతి గృహాలు, గ్రంథాలయం, బోధన, బోధనేతర సిబ్బందికి నివాస గృహాలు, 1000 మంది సామర్థ్యం కలిగిన ఆడిటోరియం, క్రీడావసతులను ఏర్పాటు చేశారు. పుణె కేంద్రంగా ఉన్న ఎస్‌ఐయూకి ఇప్పటికే నాసిక్‌, నోయిడా, బెంగళూరుల్లో ఆఫ్‌ క్యాంపస్‌ కేంద్రాలున్నాయి.