రైతుబంధుకు ఈసీ బ్రేక్‌..

` హరీశ్‌రావు వ్యాఖ్యలతోనే నిర్ణయం వెనక్కు..
హైదరాబాద్‌(జనంసాక్షి):అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు ఈసీ షాకిచ్చింది. రైతుబంధు నిధులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్‌ ఇచ్చింది. అయితే, అందుకు గల కారణాలను ఈసీ వెల్లడిరచింది. ప్రత్యక్షంగా మంత్రి హరీశ్‌ రావు వల్లే రైతుబంధుకు బ్రేక్‌ ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.అయితే, ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నియమాలను ఉల్లంఘించారంటూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఎన్నికల ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదని.. లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయవద్దని ముందే ఈసీ షరతు విధించింది. కాగా, రైతుబంధుపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ తాజాగా ఈసీ అనుమతి నిరాకరించింది.

రైతుబంధుపై విషం కక్కుతున్న కాంగ్రెస్‌
` ఆ పార్టీ రైతు వ్యతిరేకి..
` మండిపడ్డ హరీశ్‌రావు
హైదరాబాద్‌(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ రైతుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రైతుబంధు ఆపాలని కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయలేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో రైతుబంధు ఆపేశారని విమర్శించారు. ఇక్కడ కూడా రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు.‘‘కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలవగానే రైతుబంధు రద్దయ్యింది. తెలంగాణలోనూ అదే కుట్ర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతులకు రైతుబంధు దక్కకూడదన్నదే కాంగ్రెస్‌ ఆలోచన. అందుకే అక్టోబర్‌ 23న కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే, రైతు బంధు కొత్తపథకం కాదని, ఇప్పటివరకు 11 సార్లు ఇచ్చామని, మరోసారి పంపిణీ చేసేందుకు అనుమతివ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోరితే.. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. దీనికి భారాస, భాజపా, ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని రేవంత్‌ ఆరోపించారు. పోలింగ్‌కు 4 రోజుల ముందు రైతుబంధు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. రైతులపై ప్రేమే ఉంటే.. ఈసీ నిర్ణయాన్ని స్వాగతించొచ్చు కదా’’ అని హరీశ్‌ అన్నారు. ఈసీ అనుమతిని రద్దు చేసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ మరోసారి ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి వాస్తవం కాదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతుల నోటి దగ్గరి ముద్దను లాక్కున్న పార్టీ కాంగ్రెస్‌ అని మండిపడ్డారు. ఈసీని రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేయడానికి ప్రయత్నించారని, ఈసీ అనుమతి రద్దు చేశాక.. రైతులపై రేవంత్‌ కపట ప్రేమ నటిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు.