వరవరరావు అరెస్ట్‌

– అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టుకు తరలించిన పూణెళి పోలీసులు
– ఉదయం నుంచి ఏడు గంటలపాటు వరవరరావు ఇంట్లో సోదాలు
– పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
– మరో ఏడుగురి ఇళ్లలోనూ సోదాలు
– పోలీసుల తీరుపై నిరసనకు దిగిన ప్రజాసంఘాల నేతలు
హైదరాబాద్‌, ఆగస్టు28(జ‌నం సాక్షి)  నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నిన కేసులో విరసం నేత వరవరరావును పుణె పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మధ్యాహ్నం తన నివాసం నుండి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వరవరరావును నాంపల్లి కోర్టుకు తరలించారు. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ చేరుకున్న పుణె పోలీసులు.. జవహర్‌ నగర్‌లోని వరవరరావు ఇంటితో పాటు ఆయన ఇద్ద రు కుమార్తెలు, ఇఫ్లూ ప్రొఫెసర్‌ సత్యనారాయణ, జర్నలిస్టు టేకుల క్రాంతితో పాటూ మరో ఇద్దరు విరసం నేతల ఇళ్లలో సోదాలు చేశారు. వరవరరావును తన ఇంటిలోనే ఏడు గంటల పాటు ప్రశ్నించారు. వరవరరావు ఇంట్లో పలు దస్త్రాలను పుణెళి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు విషయాలపై సుధీర్ఘంగా పోలీసులు ప్రశ్నించారు. అనంతరం వరవరరావును పుణెళి పోలీసులు అక్కడి నుండి తరలించారు.
ప్రధాని హత్యకు కుట్ర కేసులో..
ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నినట్లు పుణె పోలీసులు ఈ ఏడాది జూన్‌లో గుర్తించారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని శ్రీపెరంబదూర్‌లో ఎల్‌టీటీఈ ఆత్మాహుతిదాడితో హత్య చేసిన రీతిలోనే మోదీని కూడా అంతమొందించాలని మావోయిస్టు సానుభూతిపరుల వద్ద లభ్యమైన ఓ లేఖలో ఉన్నట్లు తేలింది. ఈ లేఖలో వరవరరావు పేరు కూడా ఉండటంతో ఆయనపై పుణె పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. తాజాగా కోర్టు అనుమతితో హైదరాబాద్‌ చేరుకుని వరవరరావును అరెస్టు చేశారు. కేసు వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని భీమా-కొరెగాంలో జనవరి 1న జరిగిన హింసకు సంబంధించి దళిత నేత సుధీర్‌ ధార్వాలే, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌, మహేశ్‌ రౌత్‌, షోమా సేన్‌, పౌర హక్కుల నేత రోనా విల్సన్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరికి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణలోనే మోదీ హత్య కుట్ర బయటపడింది. రోనా విల్సన్‌ నివాసంలో లభించిన లేఖలో మోదీ హత్యకు కుట్ర విషయం ఉంది. కామ్రేడ్‌ ప్రకాష్‌ అనే వ్యక్తికి ఆర్‌ అనే పేరుతో వచ్చిన లేఖను విల్సన్‌ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2017 ఏప్రిల్‌ 18న రాసిన లేఖ అది. ప్రధాని రోడ్‌ షోలు నిర్వహించే సమయంలో ఆయనను చంపేయాలన్నది పథకం. హిందూ ఫాసిజాన్ని అంతమొందించడం మన ముఖ్య కర్తవ్యమని, మోదీ నేతృత్వంలో ఫాసిస్టు శక్తులు అనేక రాష్ట్రాల్లో ఆదివాసీల హక్కుల్ని కాలరాశాయని లేఖలో పేర్కొన్నారు. అందుకే మోదీ రాజ్‌ను అంతం చేయాలని లేఖలో ఉంది. దీంతో పాటు హిందీలో ఉన్న మరో లేఖను కూడా పుణె పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖలో వరవరరావుతో పాటు మరికొందరు మావోయిస్టు సానుభూతిపరుల పేర్లు ఉన్నాయి. మోదీ హత్యకు అవసరమయ్యే నిధులను వరవరరావు సమకూరుస్తారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ఆధారంగానే వరవరరావుపై పుణె పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు.
ఆందోళనకు దిగిన ప్రజా సంఘాలు..
వరవరరావు ఇంట్లో పుణె పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న ప్రజాసంఘాల నేతలు ఆయన ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. వరవరరావు అరెస్టు చేయడం సరికాదని, ఇది మోదీ ప్రభుత్వం కుట్ర అని ఆరోపించారు. ‘గో బ్యాక్‌ పోలీస్‌’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మోదీ హత్యకు వరవరరావు కుట్ర పన్నడం పచ్చి అబద్దమని కొట్టిపారేశారు.