‘సింగరేణిలో జయశంకర్‌ జయంతిని ఘనంగా నిర్వహించండి’

గోదావరిఖని, ఆగష్టు 5, (జనంసాక్షి):తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రోపెసర్‌ జయశంకర్‌ జయంతిని సింగరేణిలో సోమవారం ఘనంగా నిర్వహించాలని… గుర్తింపు సంఘం టిబిజికెఎస్‌ కార్మికులకు పిలుపునిచ్చింది. ఆదివారం స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య మాట్లాడుతూ… బొగ్గుగనులపై జయశంకర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించాలన్నారు. అలాగే స్ధానిక టిబిజికెఎస్‌ కేంద్ర కార్యాలయ భవనానికి జయశంకర్‌ స్మారక భవన్‌గా నామకరణం చేసినట్లు తెలిపారు. కాగా, సింగరేణిలో యాక్టింగ్‌ ఉద్యోగాలను నిర్వహిస్తున్న కార్మికులను పర్మినేంట్‌ చేసే విధంగా నెలలోగా చర్యలు చేపడుతామని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు కొంరయ్య, గద్ద కుమారస్వామి, లక్ష్మణ్‌, శంకర్‌, భాస్కర్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.