అంబరాన్నంటిన సంక్రాంతి వేడుకలు

` ఏపీలో జోరుగా కోడి పందాలు
` భారీగా తరలిచ్చిన ఇరు రాష్ట్రాల వీక్షకులు
` దేశ ప్రజలకు మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు
విజయవాడ/హైదరాబాద్‌(జనంసాక్షి): ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతోంది. వేడుకల్లో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా మొదలయ్యాయి. బరుల వద్ద పందెం రాయుళ్లు, వీక్షకులతో కోలాహలం నెలకొంది. తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో కోడిపందేలను డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి తదితరులు తిలకించారు. బరుల వద్ద పందెం రాయుళ్లు, వీక్షకులతో కోలాహలం నెలకొంది. సంప్రదాయంగా భావించే ఈ కార్యక్రమాలు ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కోడి పందేలకు బరులు ముస్తాబయ్యాయి. ఈ పందేలను చూసేందుకు దూరప్రాంతాల ప్రజలు సైతం పెద్దఎత్తున తరలివస్తున్నారు. బరుల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటుచేశారు నిర్వాహకులు. అయితే.. గతంలో లాగానే ఈసారీ కోట్ల రూపాయల్లో పందేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లా అమలాపురంలో కోడిపందేలు, గుండాటలు ప్రారంభమయ్యాయి. ప్రతి గ్రామంలోనూ కోడిపందేలు, గుండాటలు ఏర్పాటయ్యాయి. ’మూడు బరులు.. ఆరు బోర్డులు’ అన్నట్లు నిర్వాహకులు ఏర్పాట్లుచేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 150కిపైగా కోడిపందేల బరులు ముస్తాబయ్యాయి. గుడివాడ నియోజకవర్గంలో సంక్రాంతి కోడిపందేలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. కోడిపందేలు, కోత ముక్కలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్న పరిస్థితి. బరులు జాతరను తలపిస్తున్నాయి. హోరాహోరీగా కోడి పందేలు జరుగుతున్నాయి. కోడి పందేలను చూసేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. గుడివాడ రూరల్‌, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో బరులను ఏర్పాటుచేశారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో కోడి పందేలు జోరుగా మొదలయ్యాయి. కైకలూరు మండలం భుజబలపట్నంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటుచేసి మరీ కోడిపందేలను నిర్వహిస్తున్నారు. ఈ పందేలను ఎమ్మెల్సీ జయమాంగళ వెంకటరమణ తిలకించారు.కాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లో కోడిపందేలు ప్రారంభమయ్యాయి. బరుల్లో భారీ లైవ్‌ స్క్రీన్లను ఏర్పాటుచేయడంతో పాటు నాయకులు, ప్రజలు కూర్చుని చూసేందుకు బరిచుట్టూ స్టేజ్‌ను నిర్వాహకులు ఏర్పాటుచేశారు.
దేశ ప్రజలకు మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు
న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రధాని మోడీ ప్రజలకు మకరసంక్రాంతి, మాఘ బిహు మరియు పొంగల్‌ శుభాకాంక్షలు తెలిపారు. మకర సంక్రాంతి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. భారతీయ సంస్కృతి `సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నువ్వులు, బెల్లం తీపితో నిండిన ఈ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం,శ్రేయస్సు, విజయం నింపాలని కోరారు. సూర్యుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ప్రార్థించారు. అస్సాంతో పాటు ఈశాన్య రాష్టాల్రు నేడు మాఘ బిహు పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పొంగల్‌ పర్వదినం సందర్భంగా తమిళనాడు ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పండగ రైతులు, వారి కుటుంబాల జీవితాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ పండగ మనల్ని పోషించే వారికి కృతజ్ఞతలు తెలియజేయడం, తద్వారా మన సమాజాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజలు ఆత్మవిశ్వాసం, ఆశావాదాన్ని కలిగివుండాలని పేర్కొన్నారు. ఈసంవత్సరం ప్రజలందరికీ శ్రేయస్సు, సానుకూలత మరియు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని తెలిపారు.
స్వయంగా పొంగలి వండిన ప్రధాని మోడీ
పొంగల్‌ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఢల్లీిలోని కేంద్రమంత్రి మురుగన్‌ నివాసంలో పొంగల్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భగా తొలుత ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రధాని నిర్వహించారు. అనంతరం ఆయనే స్వయంగా పొంగల్‌ వండారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గోవులకు పూజ చేశారు. పొంగల్‌ వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు. మరోవైపు ఈ పొంగల్‌ వేడుకను పలువురు ప్రముఖులు ఘనంగా జరుపుకుంటున్నారు. అలానే దేశ వ్యాప్తంగా ప్రజలు వివిధ రకాల వంటకాలు చేసుకుని, ఇళ్లను అలకరించుకుని పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.