అక్టోబర్‌లో తీవ్రస్థాయికి కరోనా


హెచ్చరించిన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌
న్యూఢల్లీి,ఆగస్ట్‌23(జనంసాక్షి): అక్టోబర్‌ నాటికి కరోనా పీక్‌ స్టేజ్‌కు చేరుతుందని, పెద్దల కంటే పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి నివేదిక అందించింది. డేంజర్‌ జోన్‌లో ఉన్న చిన్నారులను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని నివేదికలో సూచించింది. పిల్లలకు అవసరమైన చికిత్సలను, వైద్య సిబ్బందిని, వెంటిలేటర్లు, అంబులెన్స్‌లను సిద్దంగా ఉంచాలని సూచించింది. చిన్నారులు పెద్ద ఎత్తున కోవిడ్‌ బారిన పడే సూచనలు ఉన్నట్లు హెచ్చరించింది. పిల్లలకు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని సూచించింది. వీలైనంత త్వరగా పిల్లలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్‌ చేయడం వల్ల థర్డ్‌ వేవ్‌ ఉధృతిని కొంత అరికట్టవచ్చునని సూచించింది. అలాగే చిన్నారుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకితే ఇతరులకు వేగంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఇదిలావుంటే నీతి ఆయోగ్‌ కూడా థర్డ్‌వేవ్‌ ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించింది. ఆస్పత్రుల్లో బెట్లు, మందులు, ఆక్సిజన్‌ సిద్దం చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో
ఇప్పుడు థర్డ్‌వేవ్‌ ముప్పు తొలగలేదని అర్థం అవుతోంది.