ఆగ్రాలో బలవంతపు మతమార్పిళ్లపై ‘సభ’లో నిరసన

1

చర్చకు విపక్షాల పట్టు

న్యూఢిల్లీ డిసెంబర్‌11 (జనంసాక్షి) :  ఆగ్రాలో బలవంతపు మతమార్పిళ్ల అంశం పార్లమెంట్‌ ఉభయ సభలను కుదిపి వేసింది.  ఈ అంశంపై ఈరోజు లోక్‌సభ అట్టుడికింది.

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి  వెంకయ్య నాయుడు ఇచ్చిన సమాధానంపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. పలు పార్టీలు వాకౌట్‌ చేశాయి. ఆగ్రాలో మతమార్పిడుల అంశంపై సభలో సభ్యులు తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో ఉద్రికతతలు లేవన్న

మూలాయం సింగ్‌ యాదవ్‌ మాటలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తప్పుపట్టారు. మత మార్పిడులు తీవ్రమైన అంశమని వెంకయ్య నాయుడు అన్నారు. ఈ విషయంలో ఒక పార్టీని నిందించడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదని చెప్పారు. అధికారులతో కేంద్ర హ్పం శాఖ సమావేశమైనట్లు తెలిపారు. ఆగ్రా మతమార్పిడుల అంశంపై యుపి ప్రభుత్వంతో మాట్లాడినట్లు చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలైనట్లు తెలిపారు. లా

అండ్‌ ఆర్డర్‌ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని అన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులు, వారి

విశ్వాసాల రక్షణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉన్నందుకు గర్విస్తున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వ స్సందనపై పలు పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కొన్ని పార్టీల సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశారు.

ఆగ్రా శివారులోని ఓ మురికివాడలో దాదాపు 60 ముస్లిం కుటుంబాలను బలవంతంగా హిందూ మతంలోకి మార్చినట్లు వచ్చిన ఆరోపణలు బుధవారం పార్లమెంట్‌ను కుదిపేశాయి. రాజ్యసభలో విపక్షాలు ఈ అంశాన్ని ప్రస్తావించాయి. సభ ప్రారంభంకాగానే జీరో అవర్‌లో బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. దీన్ని దేశ లౌకికతపై దాడిగా అభివర్ణించారు.  ‘ఆర్‌ఎస్‌ఎస్‌ సోదర సంస్థ బజరంగ్‌దళ్‌ కొందరు ముస్లింలను బలవంతంగా మతం మార్పించినట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. వారి పేదరికాన్ని అలుసుగా తీసుకుని ఈ పని చేశారు.  దీన్ని తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్య తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. ఆమెను సమర్థిస్తూ ఇతర పక్షాలు కూడా ఈ అంశంపై ప్రభుత్వ వివరణకు పట్టుబట్టాయి. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ స్పందిస్తూ.. లౌకిక విధానాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.  రాజకీయ కారణాలతో ఏదో ఒక సంస్థ పేరు చెప్పడం సరికాదన్నారు. అయితే దీనిపై ప్రధా  ప్రకటన చేయాలని కాంగ్రెస్‌, సీపీఎం డిమాండ్‌ చేశాయి. లోక్‌సభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ అంశాన్ని లేవనెత్తింది.  ఆగ్రాలో ఏం జరిగిందో కేంద్రం చెప్పాలని డిమాండ్‌ చేసింది. ఈ అంశంపై చర్చ కోసం ఆ పార్టీ  ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించారు. మతమార్పిడిపై విమర్శలను బీజేపీ తోసిపుచ్చింది.

కేసు నమోదు.. ఆగ్రాలో గత సోమవారం ధర్మ జాగరణ్‌ మంచ్‌ అనే హిందూసంస్థ 60 ముస్లిం కుటుంబాలకు చెందిన వంద మందిని యాగాగాలు చేసి హిందూ మతంలోకి మార్చింది.  దీనిపై బుధవారం పార్లమెంటులో ప్రతిపక్షాలు మండిపడిన నేపథ్యంలో… సదరు ఘటనపై ఆగ్రా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మతమార్పిడి చరేసిన జాగరణ్‌ మంచ్‌, దాని  కన్వీనర్‌ కిశోర్‌పై ఎఫ్‌ఐఆర్‌ కేసు పెట్టారు. దేవ్‌నార్‌లోని మురికివాడలో ఉండే వంద మందికిపైగా ముస్లింలను తిరిగి హిందువులుగా మార్చినట్లు సదరు సంస్థపై ఆరోపణలు వచ్చాయి. రేషన్‌కార్డులు, ఇంటిస్థలం ఇప్పిస్తామని హావిూలు ఇచ్చి మత మార్పిడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.