ఆటోను ఢీకొన్న బస్సు: ముగ్గురి మృతి

చివ్వెంల: నల్గొండ జిల్లా చివ్వెంల మండలం గుజలూరు సమీపంలో 65వ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

5brk30aసూర్యాపేటలోని ఓ చర్చిలో ప్రార్థనలు ముగించుకుని తిరిగి వెళ్తున్న ఆటోను హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. 8 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు పెన్‌పహాడ్‌ మండలం చీదెళ్లకు చెందిన మందడి బద్రమ్మ, చింత గోపమ్మ, గుడిపూడి కవితగా గుర్తించారు.