ఆటోను ఢీకొన్న లారీ: ఒకరు మృతి

సూర్యాపేట,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): సూర్యాపేటలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు విూతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  ఎస్‌వి ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద బుధవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్టు సమాచారం. లారీ అతివేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోకి వచ్చిన తరువాత భారీ వాహనాలు వేగం తగ్గించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే సూర్యాపేటకు చెందిన లక్కపాక జానయ్య(40) హైదరాబాద్‌ వెళ్లేందుకు రహదారి పక్కన వేచి చూస్తుండగా విజయవాడ వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఆయన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన పక్కనే ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.