ఆశయాలకనుగుణంగా ప్రజాప్రతినిధులంతా పనిచేయండి

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ,సెప్టెంబర్‌21  (జనంసాక్షి)

జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు సీఎం జగన్మోహనరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) సూచించారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని నందివాడ జడ్పీటీసీగా ఎన్నికైన కందుల దుర్గాకుమారి భర్త నాగరాజు, వైసీపీ గుడివాడ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, గుడివాడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు తోట నాగరాజు, నాయకులు మెరుగుమాల కాళి, యాదవ సంఘం అధ్యక్షుడు డొక్కు రాంబాబు తదితరులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహనరెడ్డి నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాలను, 25 పార్లమెంట్‌ స్థానాల్లో 22 స్థానాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెల్చుకుందన్నారు. 50శాతం పైగా ఓట్లతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  ప్రయాణం మొదలైందని చెప్పారు. ముందుగా వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు గెలుపొందారని తెలిపారు. కార్పోరేషన్‌ ఎన్నికల్లో నూరుశాతం, మున్సిపల్‌ నగర పంచాయతీ ఎన్నికల్లో 99 శాతం ఫలితాలను సాధించామన్నారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 98 శాతం, మండల పరిషత్‌ ఎన్నికల్లో 86 శాతం స్థానాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుందని తెలిపారు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలిచారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ళ కాలంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో 95 శాతానికి పైగా హామీలను ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతూ వస్తోందన్నారు. ప్రజలు ఇచ్చిన అఖండ విజయంతో ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందని మంత్రి కొడాలి నాని అన్నారు…………..
పరిషత్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు: మంత్రి కొడాలి నానిగుడివాడ,సెప్టెంబర్‌21(ఆర్‌ఎన్‌ఎ): గుడివాడ నియోజకవర్గంలో జరిగిన జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులను గెల్పించిన ప్రజలకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) కృతజ్ఞతలు తెలిపారు.మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీకొండాలమ్మ దేవస్థానం చైర్మన్‌ కనుమూరి రామిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా గుడ్లవల్లేరు ఎంపీపీ ఎన్నిక వ్యవహారంపై మంత్రి కొడాలి నానితో చర్చించారు. ఎంపీపీ పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించడం జరిగిందని తెలిపారు. గుడ్లవల్లేరు`2 ఎంపీటీసీగా పూర్ణ కవిత, కుచ్చికాయలపూడి ఎంపీటీసీగా కొడాలి కన్నమ్మ, డోకిపర్రు`1 ఎంపీటీసీగా కొడాలి సురేష్‌, డోకిపర్రు`2 ఎంపీటీసీగా మేరుగు నాగార్జునలు ఎస్సీ సామాజిక వర్గం నుండి ఎన్నికయ్యారని చెప్పారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నికపై మరోసారి చర్చిద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కోగంటి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.