ఆసుపత్రి భవన నిర్మాణానికి నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం

మునగాల, సెప్టెంబర్07(జనంసాక్షి):
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి శిధిలావస్థలోకి చేరుకొని ఉన్న సంగతి మండల వాసులకు తెలిసిన విషయమే. ఇట్టి ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కృషితో ప్రభుత్వం ఒక కోటి యాభై ఆరు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నూతన భవన నిర్మాణంతో మండల వాసుల ఇబ్బందులు తొలగనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇట్టి నిధుల మంజూరీ విషయంలో కృషిచేసిన శాసనసభ్యులు మల్లయ్యయాదవ్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సుంకర అజయ్ కుమార్, సర్పంచ్ చింతకాయల ఉపేందర్, యుగంధర్ రెడ్డి, కోల ఉపేందర్ రావు, ఉడుం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.