ఇక యాదాద్రిగా మనగుట్ట
యాదగిరిగుట్టకు జీయర్తో కలిసి సీఎం కేసీఆర్
అన్నీ ఆగమశాస్త్రం ప్రకారం ఉన్నాయి :చినజీయర్స్వామి
నల్గొండ,మార్చి5(జనంసాక్షి): యాదగిరిగుట్టను ఇకనుంచి యాదాద్రిగా పిలువనున్నారు. అంతేగాకుండా శరవేగంగా అభివృద్ది చేసి అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. ఇక్కడ చేపట్టనున్న పనులను సీఎం కేసీఆర్తో కలిసి పర్యవేక్షించిన త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి అవన్నీ ఆగమశాస్త్ర ప్రకారమే ఉన్నాయని అన్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలన్నీ ఆగమ శాస్త్రం ప్రకారమే ఉన్నాయని, ఆలయ పవిత్రత, సంప్రదాయం, ప్రత్యేకతలు చెక్కు చెదరకుండా సమగ్ర అభివృద్ది కోసం చేసిన ప్రణాళికలు అధ్బుతంగా ఉన్నాయని జీయర్ స్వామి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో కలిసి చిన్న జీయర్ స్వామి గురువారం యాదగిరిగుట్టపై ఏరియల్ సర్వే నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకున్న వీరిద్దరు గుట్ట చుట్టూ హెలికాప్టర్లో తిరిగారు. లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న ప్రధాన యాదగిరిగుట్టతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది చేయదలుచుకున్న చుట్టు ప్రక్క గుట్టలను కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ చిన్న జీయర్ స్వామికి చూపించారు. ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ది చేయాలనుకుంటున్నదీ వివరించారు. యాదగిరిగుట్టకు దారితీసే రాయగిరి, వంగపల్లి, తుర్కపల్లి, రాజపేట మార్గాలను, ఆయా ప్రాంతాలలో చేపట్టే పనులును ముఖ్యమంత్రి వివరించారు. రాయగిరి, యాదగిరిగుట్ట చెరువులను కూడా చూపించి వాటిని పర్యాటక కేంద్రాలుగా మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా తీర్చిదిద్దుతామని చెప్పారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో రిజర్వు ఫారెస్టుగా ఉన్న ప్రాంతాన్ని కూడా చూపించి నరసింహస్వామి అభయారణ్యపు ప్రతిపాదనలను చెప్పారు. నేషనల్ హైవే, రైల్వే లైను ప్రక్కనే ఉండడాన్ని కూడా చూపించి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు సులువుగా ఈపుణ్యక్షేత్రానికి రావచ్చని చెప్పారు. యాదగిరిగుట్టలో నరసింహస్వామికి, ఆంజనేయస్వామికి ఈ ఇద్దరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల తరువాత చిన్న జీయర్ స్వామికి ఆలయ ప్రాంగణంలోని అణువణువును ముఖ్యమంత్రి చూపించారు. పద్నాలుగున్నర ఎకరాల స్థలం గుట్ట పైభాగంలో వేరువేరు ఎత్తుల్లో అందుబాటులో ఉందని చెప్పారు. ఆరు ఎకరాల స్థలంలో ప్రధాన ఆలయం అభివృద్ది చేస్తామని, దాని చుట్టూ మాడ వీధులు నిర్మిస్తామని, మ్యాపుల సహాయంతో ముఖ్యమంత్రి వివరించారు. ఆంజనేయస్వామి విగ్రహం, యాగశాల, ప్రవచనశాల, వంటశాల, కళ్యాణ మంటపం తదితర నిర్మాణాల ప్రతిపాదిత స్థలాలను, దిక్కులను ముఖ్యమంత్రి చూపించారు. గుట్టపైనే 32 నరసింహుని రూపాలను ప్రతిష్టించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఆలయ నిర్మాణ రూపశిల్పులు, స్థపతి, వేదపండితులు, దైవక్షేత్రాల నిర్మాణ, నిర్వహాణలో అనుభవజ్ఞులైన వారి సలహాలు, సూచనలు తీసుకుని డిజైన్ చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఆంజనేయస్వామి విగ్రహానికి అనుబంధంగా భక్తుల మండల దీక్షల కోసం ఒక హాలు నిర్మించనున్నట్లు కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రధాన గుడికి ముందు భాగంలో మరే పెద్ద నిర్మాణం రాకుండా విశాలమైన ప్రాంగణాన్ని హరితనందనంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. స్వామి వారికి మహా నైవేద్యం సమర్పించే ఆహార పదార్ధాల తయారీ కోసం ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే వంటశాల ఏర్పాటు చేస్తామన్నారు. గుట్ట పైభాగంలో వంద వాహనాలు పట్టేలా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని, గుట్ట కింది భాగంలో 5వేల వాహనాల వరకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాన ఆలయం ఉన్న యాదగిరి గుట్టతో పాటు చుట్టూ ఉన్న మరో 8 గుట్టలను కలుపుకుని నవ గిరులను గోప్ప ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈనవగిరులకు నామ కరణం చేయాల్సిందిగా చిన్న జీయర్ స్వామిని ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుత యాదగిరిగుట్టకు యాదాద్రిగా చిన్న జీయర్ స్వామి నామ కరణం చేశారు. మిగతా 8గుట్టలకు త్వరలోనే పేర్లు పెడతామన్నారు. భక్తులు పర్యాటకులు కోసం ఈ ప్రాంతంలో తిరిగేందుకు మోనో రైలు ఏర్పాటు చేయడం, దేవస్ధానం ఆద్వర్యంలోనే వాహన సౌకర్యం కల్పించడం లాంటి ఆలోచనలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.
సిఎం కెసిఆర్కు జీయర్ అబినందన
యాదగిరిగుట్ట అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేస్తున్న ప్రయత్నాలును చిన్న జీయర్ స్వామి అభినందించారు. ఆగమ శాస్త్రం, వైదిక సంప్రదాయాలు, ఆచార విధానల ప్రకారమే ఈ ప్రతిపాదనలన్నీ ఉన్నాయని చెప్పారు. ప్రజల కోసం అభివృద్ది పనులు నిర్వహించడం ఒక ఎత్తైతే, ఆధ్యాత్మిక భావనలు పెంపోందించే కార్యక్రమాలు చేపట్టడం మరోక ఎత్తని చిన్న జీయర్ స్వామి అన్నారు.అభివృద్ది శరీరం వంటిది అయితే, ఆత్మ ఆధ్యాత్మికమైనదని చెప్పారు. ఈ సత్యన్ని గ్రహించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించారని ప్రశంసించారు. యాదగిరి గుట్టలోనే చాలా ఏండ్ల క్రితం ఆగమ సదస్సు జరిగిందని, దక్షిణ భారతదేశానికి చెందిన చాలా మంది పండితులు ఇక్కడే సమావేశమయి ఆలయాల్లో అనుసరించాల్సిన నిత్యారాధన, బ్ర¬్మత్సవాల నిర్వహణ, అభిషేకాల నిర్వహణ లాంటి కార్యక్రమాలకు ఏకరూప విధానాలు, పూజ పద్దతులు నిర్ణయించుకున్నారన్నారు. పండితులకు జ్ఞానబోధ చేసిన యాదగిరిగుట్ట నుండే కేసిఆర్ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించడంగొప్ప విషయమన్నారు. మూడు ప్రధానమైన క్షేత్రాల్లో భద్రాచలం, యాదగిరిగుట్ట, తెలంగాణలోనే ఉన్నాయని, సింహాచలం ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పారు. దైవక్షేత్రాలను పరిరక్షించాలని, ఆలయాలను అభృద్ది చేయాలని, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించాలనే సంకల్పం భగవంతుడు కేసిఆర్కు కల్పించారన్నారు. తాను ఇంతవరకు దేవాలయాల అభివృద్దికి కట్టుబడిన ముఖ్యమంత్రిని, ధృడ సంకల్పం కలిగిన నాయకుడిని చూడలేదన్నారు. ఒక దివ్యక్షేత్రానికి ఏటా వంద కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు జరపడం కూడా భారతదేశ చరిత్రలో మొట్టమొదలి సారి అని చిన్న జీయర్ స్వామి అభినందించారు. అందరూ చంద్రశేఖర్ రావులు కాలేరని, చంద్రశేఖర్ రావులాంటి కొందరు వ్యక్తులు మాత్రమే అందరికి స్పూర్తిగా నిలుస్తారని అన్నారు. అంకిత భావం, శ్రద్ద కలిగిన కేసిఆర్కు జాతి రుణపడి ఉంటుందని చిన్న జీయర్ స్వామి అన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ది కోసం కేసిఆర్ చేస్తున్న ప్రయత్నాలన్ని విజయవంతం కావాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్ల చిన్న జీయర్ స్వామి వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్రెడ్డి, శాసనమండలి డిప్యూటి చైర్మన్ విద్యసాగర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్ , ఎమ్మెల్యేలు శేఖర్ రెడ్డి, వీరేశం, ఆలయ ఇఓ గీత, జేసి సత్యనారాయణ, డిఎప్ఓ సత్యనారాయణ, యాదగిరి డెవలప్ మెంట్ ఆధారిటి వైస్ ప్రెసిడెంట్ కిషన్రావు, ఆర్కిటెక్టులు రాజ్, జగన్, టెంపుల్ ఆర్కిటెక్ట్ ఆనంద్సాయి, స్థపతి సౌందర్రాజన్, తదితరులు పాల్గొన్నారు.