బనకచర్లను ఆపండి

` ప్రాజెక్టుపై ముందుకెళ్లకుండా ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించండి
` కేంద్రానికి తెలంగాణ లేఖ
హైదరాబాద్(జనంసాక్షి): పోలవరం- బనకచర్ల లింకు ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు. బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో గతంలోనే ఫిర్యాదు చేసినట్లు లేఖలో గుర్తు చేశారు. డీపీఆర్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే, నిబంధనలు, విభజన చట్టానికి వ్యతిరేకంగా బనకచర్ల లింక్ ప్రాజెక్టు చేపట్టకుండా చూడాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు లేఖ రాసింది. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. పోలవరం – బనకచర్ల విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా నిలువరించాలని కోరారు. టెండర్, భూసేకరణ విషయంలో ముందుకెళ్లకుండా చూడాలని కోరారు.