ఈమె మృత్యుంజయురాలు

17 రోజుల తర్వాత శిథిలాల కిందినుంచి వెలికితీత
వెయ్యికి చేరిన ఢాకా మృతులు
ఢాకా, (జనంసాక్షి) :
బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో కుప్పకూలిన ఎనిమిది అంతస్తుల భవంతి శిథిలాల కింది నుంచి 17 రోజుల తర్వాత ఓ యువతిని సజీవంగా వెలికితీశారు. కదలేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఢాకాలోని బహుళ అంతస్తుల భవనంలో నిర్వహిస్తున్న వస్త్ర పరిశ్రమలో వేలాది కార్మికులు పనిచేస్తుండగా, ఆ భవనం గత నెలలో కుప్పకూలింది. ఈ దుర్ఘటన మృతుల సంఖ్య వెయ్యికి చేరింది. కార్మిక రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద దుర్ఘటనగా చెప్పుకునే ప్రమాదంలో 17 రోజుల తర్వాత ఒకరు ప్రాణాలతో బయటపడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.