ఈర్యా తండాలో మహిళ దారుణ హత్య

ఖమ్మం : కారేపల్లి మండలం రేలాకయాలపల్లి ఈర్యా తండాలో బానోత్ అరుణ (28) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. అరుణను హత్య చేసి ఆమె మృతదేహాన్ని సమీపంలోని రైల్వేట్రాక్‌పై పడేశారు. శుక్రవారం ఉదయం ట్రాక్ పై మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని… మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం… అరుణ భర్త మూడు సంవత్సరాల క్రితం చనిపోయాడు. అయితే గ్రామంలో ఉన్న రమేష్ అనే యువకుడితో అరుణ వారం క్రితం పారిపోయి వివాహం చేసుకుంది. అరుణ కంటే రమేష్ వయసులో చిన్నవాడు. ఈ విషయంపై గురువారం తండా గ్రామంలో పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. తెల్లవారేసరికి అరుణ శవం రైల్వే ట్రాక్పై ఉంది. దీంతో రమేశ్ తల్లిదండ్రులు, బంధువులే ఈ హత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.