ఉద్యమంలా మొక్కలు నాటే  కార్యక్రమం

ఎక్కడిక్కడ కొనసాగుతున్న పనులు
జనగామ,జూలై22(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అధికారికంగా ప్రారంభం కాకపోయినా జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎక్కడిక్కడే కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటుతున్నారు.  జనగామను గ్రీన్‌హబ్‌గా మారుద్దాం అంటూ కలెక్టర్‌ లుపునివ్వడమే కాకుండా కార్యక్రమ విజయవంతం పై ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతున్నారు. హరితహారాన్ని లక్ష్యం మేరకు పూర్తి చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. మంత్రి ఎర్రబల్లి దయాకర్‌ రావు కూడా జిల్లాల్లో పర్యటిస్తూ ప్రోత్సహిస్తున్నారు. దీంతో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం జనగామ జిల్లాలో జోరుగా సాగుతోంది. వానలు కూడా సహకరిస్తుండడంతో అన్ని వర్గాలు ఉత్సాహంగా మొక్కలు నాటుతున్నారు. వానలు కురువాలంటే వృక్షాలు ఉండాలి అనే విషయాన్ని సామాన్య జనానికి అర్థం అయ్యేలా అధికార యత్రాంగం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాలో ఎక్కడ చూసినా పచ్చలహారం పనులు కనిపిస్తున్నాయి.  ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో కనీసం 40 వేల మొక్కలు నాటాలని నిర్దేశించారు. ఊరూరా ఉద్యమంలా మొక్కల పెంపకం సాగుతోంది. గతేడాది జిల్లాలో కోటి 44 లక్షల సీడ్‌బాల్స్‌ తయారు చేసిన ప్రజలు వాటిని ఖాళీ ప్రదేశాలు, కొండలు, గుట్టలున్న చోట చల్లారు.  అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సవిూక్షలు చేస్తూ మొక్కల పెంపకం విజయవంతం కావడానికి దిశా నిర్ధేశం చేస్తున్నారు. జిల్లాకు చెందిన జనగామ ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులతో ముమ్మరంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాలో అడవుల విస్తీర్ణం పెంచే ధ్యేయంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాలకనుగుణంగా పల్లెల నుంచి పట్టణాల వరకూ హరితోద్యమం నిర్వహిస్తున్నారు. వానలు వాపస్‌ రావాలంటే మొక్కలను విరివిగా పెంచాలన్న సీఎం కేసీఆర్‌ నినాదాన్ని గులాబీ శ్రేణులు
ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో హరితహారం రోజురోజుకు జోరందుకుంటోంది. దీంతో జిల్లాలో ఒక శాతం ఉన్న అడవులను 33శాతానికి పెంచాలన్న లక్ష్యంతో అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఇందులో భాగంగా గతేడాది హరితహారం కార్యక్రమంలో 67లక్షల మొక్కలను జనగామ డివిజన్‌లో నాటారు. అజనగామ జిల్లాను గ్రీన్‌హబ్‌గా మార్చడంలో భాగంగా జిల్లా మొత్తంగా 85లక్ష ల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతీ గ్రామ పంచాయతీ 40వేల మొక్కలకు తక్కువ కాకుండా నాటాలని నిర్ధేశించుకున్నారు. అన్ని మండలాలు అనుకున్న లక్ష్యాన్ని చేరాలన్న పట్టుదలతో ముందుకుసాగుతున్నాయి. నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా యంత్రాంగం చర్యలు చేపడుతోంది.  గత వేసవి నుంచే ప్రత్యేక కార్యాచరణతో అటవీశాఖ, డీఆర్‌డీఏ శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతూ నర్సరీల్లో మొక్కలను పెంచారు.