ఎన్నికల తరవాత కెసిఆర్‌ కీలక భూమిక

జనగామ,మార్చి11(జ‌నంసాక్షి): వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం కేంద్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలకపాత్ర పోషించనున్నారని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాల్లో 16 టీఆర్‌ఎస్‌, ఒకటి ఎంఐఎం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నగరా మోగడంతో ఇక తామంతా కార్యక్షేత్రంలోకి దిగామని అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రపంచానికి పరిచయం చేసి ఆదర్శంగా నిలిచిన కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొన్న పార్లమెంట్‌ సన్నాహక సమావేశం విజయవంతంలో కార్యకర్తల్లో కూడా ఉత్సాహం నిండిందని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు అయ్యారని రాజయ్య తెలిపారు.