ఏ తప్పూ చేయలేదు : అశ్వనీకుమార్‌

న్యూఢిల్లీ, మే 11 (జనంసాక్షి) :
తాను ఏ తప్పూ చేయలేదని, సుప్రీంకోర్టు తనను తప్పు బట్టలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అశ్వనీకుమార్‌ చెప్పారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పిదమూ చేయనప్పటికీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ కోరినందునే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. బొగ్గుక్షేత్రాల కేటాయింపులలో అక్రమాలపై సీబీఐ ముగింపు పెట్టడానికే తాను వైదొలిగానని అన్నారు. తన అంతరాత్మ స్వచ్ఛంగా ఉందని, తన సచ్చీలత రుజువవుతుందని నమ్మకమున్నట్లు చెప్పారు. పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా తాను చేయాల్సింది చేశానని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏ నాయకుడూ తనపై నమ్మకాన్ని కోల్పోలేదని చెప్పారు. చివరికి సత్యం, న్యాయం గెలుస్తాయని తాను నమ్ముతున్నానని అశ్వనీకుమార్‌ అన్నారు.