కష్టపడితే చదివితే ఉజ్జ్వల భవిష్యత్
సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్జ్వల భవిష్యత్కు రాగలరని జిల్లా సబ్ కలెక్టర్ భారతి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని హవేలీఘనపూర్ వద్ద వైపిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లోని పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రేరణ తరగతుల శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రణాళికాబద్ధంగా చదివితే ఉజ్జ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు. దేశభవిష్యత్కు విద్యార్థులు పునాది వంటి వారని అన్నారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు ఎన్నో రాయితీలను కల్పిస్తోందని, వాటన్నింటినీ సద్వినియోగం చేసుకునేలా పాఠశాలల యాజమాన్యం చూడాలని అన్నారు. విద్యార్థులకు అందించే ఉచిత భోజనంతో పాటు దుస్తులు, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తున్నదని, వాటిని కూడా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమ బోధన అందించే దిశగా ప్రణాళికను రూపొందించాలని కోరారు. కార్యక్రమంలో వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి రాంరెడ్డి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి నాగరాజగౌడ్, వైపిఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.