కారులో మంటలు.. ఐదుగురి సజీవదహనం

చిత్తూరు జిల్లాలో ఘోరం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో మంటలు చెలరేగి ఐదుగురు అగ్నికి ఆహుతయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతికి చెందిన విష్ణు అనే వ్యక్తి సోదరి కళ బెంగళూరులో ఉంటున్నారు. ఇటీవల కొడుకు భానుతేజతో కలిసి ఆమె తిరుపతికి వచ్చారు. కళా, భానుతేజను తిరిగి బెంగళూరులో వదిలేందుకు విష్ణు, ఆయన భార్య జాహ్నవి, కుమారుడు పవన్‌రాం, కుమార్తె సాయిఆశ్రితతో కలిసి శనివారం కారులో తిరుపతి నుంచి బయలుదేరారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని మామడుగు సమీపంలోకి చేరుకోగానే కారు అదుపుతప్పి బోల్తాపడింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జాహ్నవి, కళ, భానుతేజ, పవనరాం, సాయిఆశ్రిత మంటల్లో చిక్కుకుని కాలిబూడిదకాగా, విష్ణు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని స్థానిక దవాఖానకు తరలించారు.